19-02-2025 06:24:00 PM
కేకే 5 గని మేనేజర్ ప్రవీణ్...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తరచూ విధులకు హాజరై నాగాల పేరిట ఉద్యోగాలు కోల్పోవద్దని కేకే-5 మేనేజర్ ప్రవీణ్ కోరారు. బుధవారం ఏరియాలోని కేకే 5 గనిపై నిర్వహించిన గైర్హాజరు కార్మికుల కౌన్సిలింగ్ లో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. కార్మికులకు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను ఇతరులకు చెప్పడం ద్వారా పరిష్కారానికి మార్గం దొరుకుతుందన్నారు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో నుండి గైర్హాజరుకు సంబంధించి సర్కులర్ వచ్చిందని, దీనిలో భూగర్భ కార్మికులు ప్రతినెల 16 మాస్టర్లు, ఉపరితల కార్మికులు 20 మస్టర్లు చేయాల్సి ఉంటుందన్నారు.
గైర్హాజరు కార్మికులకు ప్రతినెల కౌన్సిలింగ్ ఉంటుందని, తరచూ విధులకు గైర్హాజరు కావడంతో మస్టర్లు లేక డిస్మిస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయనీ ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు మానిన, ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి కార్మికులు వారి పరిస్థితిని తనతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకు వెళితే కొద్ది రోజులు సర్ఫేస్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పని లేకుండా విధులకు గైర్హాజరువుతూ అటు వారి కుటుంబాలకు ఇటు సింగరేణి సంస్థకు భారం కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గైర్హాజరు కార్మికులు విధులకు హాజరయ్యేందుకే ఈ అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వారిలో మార్పు వచ్చి విధులకు హాజరయ్యే వరకు కౌన్సిలింగ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి రమేష్, సంక్షేమ అధికారిని ఆకుల రవళి, ఆఫీస్ సూపర్డెంట్ బుచ్చయ్యలు పాల్గొన్నారు.