calender_icon.png 25 October, 2024 | 9:56 AM

ఈసారి వదలొద్దు

07-07-2024 12:05:00 AM

నేడు భారత్, సౌతాఫ్రికా రెండో టీ20

చెన్నై: తొలి టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత మహిళల జట్టు ఒక్కరోజు వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని హర్మన్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టెస్టును కోల్పోయిన సఫారీలు ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో మరోసారి భారీ స్కోర్లు వచ్చే అవకాశముంది.

మన అమ్మాయిలు తొలి టీ20లో మంచి ప్రదర్శనే నమోదు చేసినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ వైపల్యం జట్టు కొంపముంచింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, హర్మన్, రోడ్రిగ్స్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. రేణుకా సింగ్, ఆశా శోభన, అరుంధతీ రెడ్డి, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తోంది. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఏంచుకోవడమే మేలు అని తొలి మ్యాచ్ ద్వారా నిరూపితమైంది. మరోవైపు సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కెప్టెన్ వోల్వర్ట్, మారినే కాప్, తంజిమ్ బ్రిట్స్ మరోసారి కీలకం కానున్నారు.