07-03-2025 01:42:32 AM
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
చర్ల, మార్చి 6 (విజయ క్రాంతి) :నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ ప్రజలను కోరారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల పోలీసులు, సిఆర్పిఎఫ్ అధికారులతో కలిసి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ గురువారం చర్ల మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన బట్టిగూడెం,రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ఎవరూ సహకరించవద్దని పరోక్షంగానైనా,ప్రత్యక్షంగానైనా నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖ తరపున అట్టి సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్,చర్ల సిఐ రాజువర్మ,ఎస్ఐ నర్సిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.