17-02-2025 11:33:28 PM
హైడ్రా కమిషనర్ ఈవీ రంగనాథ్ సూచన..
ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగర శివార్లలో ఫార్మ్ ల్యాండ్ల పేరుతో ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలను హెచ్చరించారు.. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, లక్ష్మిగూడ విలేజ్ సర్వే నంబర్ 50లోని 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేశారు.
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదని పేర్కొన్నారు. ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్ధేశించిందని తెలిపారు. ఈ మేరకు ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీవో నంబర్ 131 ప్రకారం 2020, ఆగస్టు 31 తర్వాత వెలసిన గుర్తింపులేని లే ఔట్ ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు. నగర పరిధిలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కుల కోసం, 30 శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా ఆ నిబంధనలను పాటించడం లేదని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారు.
64 ఫిర్యాదులు
హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులు వచ్చినట్టు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. తమ కాలనీలకు వెళ్లకుండా.. కొంతమంది చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని, నాలాలు కబ్జా చేసి.. వరదనీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని ఎక్కువ సంఖ్యలో కమిషనర్కు ఫిర్యాదులందాయి. దీంతో రహదారులకు అడ్డంగా నిర్మాణాలు, ప్రహరీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాటిని ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని హైడ్రా అధికారులకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రహరీ నిర్మించడానికి అనుమతులున్నాయా లేదా పరిశీలించి వెంటనే వాటిని తొలగించాలన్నారు.