హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గతకొద్ధి రోజులుగా చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టాడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజా హైడ్రాపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం స్పందించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి సంచులు సమాకూర్చడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తుందని డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను తెరపైకి తెచ్చారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై శనివారం జేపీసీ హైదరాబాద్ కు వస్తోందని డీకే అరుణ పేర్కొన్నారు. రేపు జేపీసీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చని, వక్ఫ్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆమె తెలిపారు. ముస్లీంలకు న్యాయం కోసమే కేంద్రం సవరణ బిల్లు తెచ్చిందని డీకే అరుణ వెల్లడించారు.