13-03-2025 01:39:07 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం; మార్చి 12 (విజయక్రాంతి) : జల సంచయ్ జన్ భగీదారి క్యాచ్ ద రైన్ అమలులో భాగంగా దేశంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని హమాలీ కాలనీలో జల సంచయ్ జన్ భగీ దారి అమలులో భాగంగా కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఎలా నిర్మించాలి అని పరిశీలించారు. దీనిలో భాగంగా కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంత ను త్రవ్వారు. స్థానికంగా ఉన్న యువకులతో మమేకమై వారితో కలిసి ఇంకుడు గుంటల నిర్మాణాన్ని కలెక్టర్ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన భూగర్భ జలాలను అభివృద్ధి పరచడానికి ఇంకుడు గుంతల ఆవశ్యకతను యువకులకు వివరించారు. ఇంకుడు గుంత తవ్వకానికి గంటన్నర సమయం మాత్రమే పట్టిందని, యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, భవిష్యత్తు కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.