జిల్లా వ్యవసాయ అధికారి కల్పన
మందమర్రి,(విజయక్రాంతి): ముందస్తు జాగ్రత్తలతోనే పంటలను కాపాడుకోవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. గురువారం మండల పరిధిలోని అమరవాది శివారులోని పత్తి చేలను పరిశీలించారు. ఈ సందర్బంగా పత్తి లో వివిధ ఆకుమచ్చ తెగుళ్ల నివారణ చర్యలను రైతులకు వివరించారు పత్తి పంటలో సూక్ష్మ దాతు లోపాలను ముందుగానే గుర్తించి నివారించుకోవాలని సూచించారు.సస్యరక్షణలో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారుల పంటల నమోదు పరిశీలించారు. మండలంలోని నార్లాపూర్, పులి మడుగు శివారు వరి పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజు లు పరిశీలించారు.
ఈ సందర్బంగా వరిలో సుడి దోమ, రెల్ల రాల్చు పురుగు, కాండం కుళ్లు తెగులు ఉధృతి ఉన్నట్లు గుర్తించి, సుడి దోమ నివారణకు రైతులు నత్రజని ఎరువులు తక్కువగా వాడాలని,నీటిని తీసేసి పొలాన్ని ఆరబెట్టాలని సూచించారు. దుబ్బుకు పది నుంచి పదిహేను దోమలు కనిపించినట్లైతే ఇమిడాక్లోప్రైడ్ 37 శాతం ఎస్.ఎల్ 100 మీ.లీ లేదా పైమెట్రోజిన్ 50 డబ్ల్యూ.జి 120 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలని, రెల్ల రాల్చు పురుగు నివారణకు క్లోరాంతనిలిప్రోల్ 60 మీ.లీ ఒక ఎకరానికి, కాండం కుళ్లు నివారణకు అజాక్సీస్ట్రోబిన్, డిఫెనకొనజోల్ ల మిశ్రమం 160 మీ.లీ ఒక ఎకరానికి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అరుకటి రవీందర్, తిరుపతి, రాజు నాయక్, ఆలు నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.