10-04-2025 01:44:21 AM
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, ఏప్రిల్ 9(విజయక్రాంతి): పేదలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక నిర్ణయమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
బుధవారం కడియం శ్రీహరితో పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, స్టేషన్ఘన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య స్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలో తాటికొండ యాదమ్మ ఇంట్లో వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొదటిసారిగా పేదలకు సన్న బియ్యం ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలోని 335 రేషన్ దుకాణాల ద్వారా 1,61,264 లబ్ధిదారులకు 3,151 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.