16-02-2025 12:08:53 AM
ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారని 2023లో విష్ణువర్ధన్, మన్సూర్పై కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఎన్నికల ఉల్లంఘనలకు సంబం ధించి కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శులు పి.విష్ణువర్ధన్, మన్సూర్ అలీఖాన్లపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 నవంబర్ 22న రాత్రి 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ తరఫు అభ్యర్థి కోట నీలిమ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా కార్యక్రమంలో పి.విష్ణు వర్ధన్, మన్సూర్ అలీఖాన్లు కూడా పాల్గొన్నారు.
ఎలాంటి అనుమతుల్లేకుండా బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి సికింద్రాబాద్ కోర్టులో 2024లో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ విష్ణువర్ధన్, మన్సూర్ అలీఖాన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు. నిందితులపై నేరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని, నేరం చేసినట్లు సాక్ష్యాలు కూడా లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.