calender_icon.png 21 February, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ తహసీల్దార్ పై క్రమశిక్షణ చర్యలు

19-02-2025 12:39:54 AM

మేడ్చల్, ఫిబ్రవరి 18(విజయ క్రాంతి): మేడ్చల్ తహసీల్దార్ బి. శైలజ  క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ కాగా ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేస్తున్నట్టు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తహసిల్దార్ శైలజ మేడ్చల్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయమై విజయ క్రాంతి దినపత్రికలో వరుస కథనాలు వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విజయ క్రాంతి దినపత్రికలో కథనాలు రాగానే సెలవు పై వెళ్లి చాలా రోజుల తర్వాత మళ్లీ వచ్చి జాయిన్ అయ్యారు.

ఆ సమయంలోనే ఆమె బదిలీకి ప్రయత్నించారు. ఆమెపై ఆరోపణలు ఉన్నందున విచారణ అంశాలపై వివరణ ఇవ్వాల్సి ఉండడంతో బదిలీకి ఉన్నతాధికారులు అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక విధులకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

రూ.100 కోట్ల విలువైన భూదాన్ భూమిపై....

మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామ శివారులో రూ. 100 కోట్ల విలువైన భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విజయక్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. 5.04 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసిల్దార్ శైలజ సిఫారసు చేసిన ఫైలును కలెక్టర్ గౌతం అనుమానంతో హోల్ లో పెట్టారు.

అంతేగాక ఈ భూమిపై అంతర్గత విచారణ చేయించగా భూదాన్ భూమిగా తేలింది. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు. అతని భూమి ముగ్గురికి సమానంగా పంచాల్సి ఉండగా ఇద్దరు పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై విజయ క్రాంతి దినపత్రికలో కథనం రావడంతో విచారణ చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్ ను ఆదేశించారు.

జూలై 27వ తేదీన కీసర ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరిగింది. రాజ బొల్లారం గ్రామ రెవెన్యూ పరిధిలో 207 సర్వే నెంబర్ లో ఉన్న పట్టా భూమి పట్టాదారుకు కాకుండా మరొకరికి కన్వర్షన్ చేశారు. దీనిపై విచారణ చేయాలని సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్ ను ఆదేశించారు. శైలజ ఇలాంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.