calender_icon.png 4 March, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

03-03-2025 08:23:56 PM

చంపాపేటలోని రెడ్డి కాలనీ ప్రభుత్వ బాలుర దివ్యాంగుల సదనంలో దివ్యాంగుల ఆందోళన....

ఘటనా స్థలానికి విచ్చేసిన రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి..

పది రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ.. 

ఎల్బీనగర్: దివ్యాంగుల హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులు ఆందోళన చేపట్టి, నిరాహార దీక్ష చేపట్టారు. చంపాపేట డివిజన్ లోని రెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలుర దివ్యాంగుల సదనంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం సుమారు 200 మంది దివ్యాంగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ... సదనంలో ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు,  ఉపాధి అవకాశాలతో పాటు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 చట్టం ప్రకారం రెడ్డి కాలనీలో ఉన్న దివ్యాంగుల సదనాన్ని వికలాంగులకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని కోరారు.

సదనంలో ఉంటున్న దివ్యాంగులకు రెండేండ్లుగా కాస్మోటిక్ చార్జీలు, బెడ్ షీట్లు, నోట్ బుక్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీజర్లు మంజూరు చేసిన ఇప్పటివరకు సదనంలో బిగించలేదని తెలిపారు. సదనానికి పర్మినెంట్ వార్డెన్ తో పాటు సరిపడా వర్కర్లను నియమించాలని డిమాండ్ చేశారు. చంపాపేట మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి దివ్యాంగుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ముందుగా రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు సంధ్యారాణి వెంటనే హాస్టల్ కు వచ్చి, దివ్యాంగులతో చర్చించారు. వారు వినకపోవడంతో దివ్యాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్ శైలజ ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్చి 20లోగా సమస్యలను పరిష్కరిస్తానని డీడబ్ల్యూ అధికారి సంధ్యారాణి రాతపూర్వకంగా హామీ పత్రం ఇవ్వడంతో దివ్యాంగులు ఆందోళన విరమించారు. ఆందోళనలో సుమారు 200 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.