calender_icon.png 9 October, 2024 | 1:45 AM

ధరణిని ప్రక్షాళన చేసి తీరుతాం

08-10-2024 12:39:56 AM

దసరా కానుకగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 7(విజయక్రాంతి)/కల్వకుర్తి: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేసి తీరుతామని రెవెన్యూ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. భూ సమస్యలను తొలగించేలా నూతన ఆర్‌ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.

సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి మున్సిపాలీటీలతో పాటు సిల్లార్‌పల్లి గ్రామంలో పలు అబివృద్ధి పనులను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. అధికారం కోల్పోయిన కొందరు తమ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను నమ్మొద్దన్నారు.

దసరా కానుకగా ప్రతి నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను పంపిణీకి ఏర్పాట్లు జరుగుతు న్నాయన్నారు. కల్వకుర్తిలో ఆర్డీవో కార్యాలయ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.  రుణమాఫీ కోసం మరరో రూ.500కోట్లు ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేర కు కల్వకుర్తిలో రూ.44కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆయ నవెంట మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ ఉన్నారు. 

మంత్రి పర్యటనలో జేబుదొంగలు

మంత్రి పొంగులేటి పర్యటనలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్ జేబులో నుంచి రూ.28వేలు, ఇంద్రానగర్ కాలనీకి చెందిన వ్యక్తి జేబులో నుంచి రూ.10వేలు, మరో వ్యక్తి జేబు నుంచి రూ.6వేలు కొట్టేశారు. కౌన్సిలర్ జేబులో నుంచి కొట్టేస్తున్న క్రమంలో తేరుకుని అరవడంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ వెంటపడినా దొరకలేదు.