19-03-2025 05:21:02 PM
భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేయండి..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
పాపన్నపేట: ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని మాత దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ వల్ల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఏడుపాయల అమ్మవారి ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి తిరిగి పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేకమంది భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు.
వేసవి కాలంలో ఎండ నుండి ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజగోపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకుగాను చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ ప్రాంగణం అంతా కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి ఏ రోజు ఎంతమంది వస్తున్నారని, ఆదివారం భక్తుల రద్దీ మరియు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రానున్న వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చలువ పందిళ్లను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల తాసిల్దార్ సతీష్ ఆలయ ప్రధానపూర్ శంకర్ మండల ఆర్ఐ నాగరాజుతో పాటు ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.