calender_icon.png 25 September, 2024 | 4:01 AM

కాళేశ్వరం తరహాలో మంథని అభివృద్ధి

25-09-2024 01:34:29 AM

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్

మంథని, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం తరహాలో మంథని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దేవాదాయశాఖ మంత్రి ఆదేశాలతోనే క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ అన్నారు.

మంగళవారం మంథనిలోని మహాలక్ష్మి ఆలయాన్ని ఆమె పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు.  అర్చకుల నుంచి ఆలయాల చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గోదావరి తీరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఉన్నందున భక్తులకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత వసతులు కల్పించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు.

దేవాదాయ శాఖ కమిష నర్ హనుమంతరావు, కలెక్టర్ కోయ శ్రీహ ర్ష పాల్గొన్నారు. వచ్చే నెల 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆమె అవిష్కరించారు. 

కాళేశ్వరం వికాసానికి మాస్టర్‌ప్లాన్

మహాదేవపూర్, సెప్టెంబర్ 22: కాళేశ్వరం దేవస్థానం, మంథని, రామగిరిలను కలుపుతూ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ నిర్మించి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను ప్రారంభించినట్టు శైలజారామయ్యర్ తెలిపారు. కాళేశ్వరం దేవస్థానంలో సమీక్ష నిర్వహించారు.

2025 సరస్వతీ నది పుష్కరాలు, 2027 గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి వచ్చేవిధంగా ప్రణాళిక ఉండాలని ఆదేశించారు వసతి గదులను గుండుతో వచ్చే భక్తులకు ఇవ్వడంలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె దేవాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోదావరి హారతి వారానికి ఒకసారి నిర్వహించి భక్తులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. గోదావరిలో మురుగు నీరు చేరకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. 12 ఎకరాల స్థలంలో టెంట్‌సిటీని నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

మేడిగడ్డ ప్రాజెక్టువద్ద 150 ఎకరాల స్థలాన్ని పర్యాటక వనంగా ఎకో టూరిజం పార్కుగా మార్చాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ఉన్నారు.