calender_icon.png 8 October, 2024 | 8:05 AM

రూ.4.85 కోట్లకు రూ.14.55కోట్లు జమ

08-10-2024 12:00:00 AM

విద్యుత్ ఉద్యోగుల ఖాతాల్లోకి..

నాగర్‌కర్నూల్ ఎస్బీఐ అధికారుల నిర్వాకం

ఆలస్యంగా తేరుకున్న బ్యాంక్ అధికారులు 

రికవరీలో తలమునకలు 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ ఎస్బీఐ ఉద్యోగుల నిర్వాకంతో విద్యుత్ శాఖ ఉద్యోగుల ఖాతా ల్లో రూ.4.85 కోట్లకు బదులు రూ.14.55 కోట్లు జమ అయ్యాయి. ఆలస్యంగా తేరుకున్న బ్యాంక్ అధికారులు ఆ డబ్బును రికవరీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ఘటన ఈ నెల 3న చోటు చేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని విద్యుత్ శాఖలో పని చేస్తున్న 506 మంది ఉద్యోగుల నెలసరి వేతనాల చెల్లింపునకు ఆ శాఖ ఉన్నతాధికారులు రెండు చెక్కులు రూ.1.85కోట్లు ఒకటి, రూ.మూడు కోట్లు మరో చెక్కు మొత్తం రూ.4.85 కోట్ల విలువ గల చెక్కులను ఉద్యోగుల జాబితా, బ్యాంక్ ఖాతా నంబర్లతో సహా నాగర్‌కర్నూల్ మెయిన్ రోడ్డు ఎస్బీఐ బ్రాంచికి పంపించారు.

అక్కడి క్యాషియర్, ఆయన పైఅధికారి నిర్లక్ష్యం కారణంగా ఒక ఉద్యోగికి మూడు నెలల జీతం ఖాతాల్లో జమ అయ్యింది. లావాదేవీల్లో భారీగా తేడాలు రావడంతో బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించి విద్యుత్ శాఖ, ఆర్బీఐకి వేర్వురుగా సమాచారాన్ని ఇచ్చారు.

వారి ఆదేశాల మేరకు జీతాలు అధికంగా జమ అయిన ఖాతాలన్నింటినీ నిలిపివేశారు. అయితే సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు డబ్బులను డ్రా చేసుకున్నారు. దీంతో రికవరీ చేసుకునేందుకు బ్యాంక్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు నాలుగు రోజులుగా రికవరీ కోసం ప్రయత్నించగా ఇంకా 12 మంది ఉద్యోగుల నుంచి రూ.6.79 లక్షలు రావల్సి ఉన్నదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కానీ ఈ సంఖ్య మూడింతలు ఉన్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తప్పిదానికి కారణమైన ఇద్దరి బ్యాంకు ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. అయితే ఈ డబ్బులు రికవరీ కాకపోతే పరిస్థితి ఏమిటనే చర్చ ఊపందుకుంది. దీనిపై బ్యాంక్ మేనేజర్ మధుసూదన్‌రావును వివరణ కోరగా.. కేవలం సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని, రికవరీ కూడా దాదాపు పూర్తకావచ్చిందని తెలిపారు.