calender_icon.png 25 October, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్!

02-08-2024 12:05:00 AM

  1. జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలు 
  2. నానాటికీ పెరుగుతున్న జ్వరపీడితులు 
  3. జూలైలో 52 డెంగ్యూ కేసులు నమోదు 
  4. దవాఖానలకు క్యూ కడుతున్న బాధితులు

కరీంనగర్, ఆగస్టు 1 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో జూలై నెలలో 52 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ప్రభు త్వ ఆసుపత్రి జ్వరపీడితులతో నిండిపోతుం ది. రెండువారాలపాటు కురిసిన ఓ మోస్తరు వర్షానికి నీటి గుంతలు ఏర్పడి దోమలు విజృంభించాయి. దీంతో వైరల్ ఫీవర్స్‌తోపాటు డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరు గుతున్నాయి. జ్వరపీడితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో ఒకరు మృతిచెందారు.

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో గురువారం ఒక్కరోజే ఐదు పాజిటివ్ కేసు లు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. విషజ్వరా లు, డెంగ్యూ కేసుల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు వెయ్యి వరకు ఓపీకి పేషెంట్లు వస్తుండగా ఇందులో 150 వరకు జ్వరపీడితులే ఉంటున్నారు. హుజూరాబాద్ ఆసుపత్రికి రోజుకు 500 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తుండగా ఇందులో 100 వరకు జ్వరపీడితులు ఉంటున్నారు. 

జ్వరపీడితుల క్యూ

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పొరుగు జిల్లాల నుంచి సైతం డెంగ్యూ జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. వానకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులు వచ్చి వ్యాధులు ప్రజల్ని వణికిస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బం ది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో జిల్లాలోని ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా సీజనల్ వ్యాధు లు ఉన్నవారే వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. జ్వర పీడితుల కోసం ఇప్పటికే రెండు వార్డులు ఉన్నప్పటికీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి వెల్లడించారు.

ఆసుపత్రిలో ప్రధాన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, మందుల కొరత లేదని స్పష్టంచేశారు. జ్వరం వస్తే వెంటనే డాక్టర్‌ను సం ప్రదించాలని కోరారు. జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలలో జ్వర పీడితులు, సీజనల్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్‌కు వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. 

పేరుకే డ్రై డే

జ్వరాల సీజన్ వర్షాకాలం, చలికాలంలో ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించారు. పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉండగా ప్రారంభంలో తప్ప ఎక్కడ డ్రైడే పాటించిన దాఖలాలు లేవు. పల్లెల సంగతి అటుంచితే స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో ఒకటి రెండు డివిజన్లలో తప్ప డ్రైడే స్పెషల్ డ్రైవ్ చేపట్టడం లేదు. డ్రైన్లలో మురుగు తొలగించడం లేదు. వర్షాలతో డివిజన్లలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగి దోమలు విజృంభిస్తున్నాయి. 

నిరుపయోగంగా వెల్‌నెస్ సెంటర్ 

కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ఉన్న వెల్‌నెస్ సెంటర్‌కు ఈ సీజన్‌లో వస్తున్న జ్వరపీడితులకు నిరాశే ఎదురవుతుంది. వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయుల కోసం ఏర్పాటు చేసింది. జ్వరం వచ్చిందని రక్త పరీక్షలకు వెళ్తే నిన్నటి వరకు ప్రైవేట్ రోగ నిర్దారణకు రక్త నమూనాలు పంపించిన వెల్‌నెస్ సెంటర్ నిర్వాహకులు ఇప్పుడు సిద్ధిపేట వైద్య కళాశాలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి రిపోర్టులు రావాలంటే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుండటంతో ప్రైవేట్ ల్యాబ్‌లవైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా పెండింగ్‌లో ఉంచడంతో వెల్‌నెస్ సేవలు అందకుండా పోతున్నాయి.