calender_icon.png 21 October, 2024 | 3:10 AM

అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చం

21-10-2024 12:54:06 AM

స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): చెరువులు, కుంటల సమీపంలో చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ సద్భావన యాత్ర పురస్కరించుకొని చార్మినార్ వద్ద మాట్లాడుతూ చట్టబద్ధమైన అనుమతులు ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్థలాలను కొనుగోలు చేసి, నిర్మాణాలు చేపట్టిన వారెవ్వరూ హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారన్నారు.

చెరువుల దగ్గర నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుందంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ఈ వ్యాఖ్యల వీడియోను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఎం ఆదేశించినట్లుగా చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని రంగనాథ్ స్పష్టం చేశారు.