15-02-2025 01:34:02 AM
మేడ్చల్, ఫిబ్రవరి 14(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం డి.పి పల్లి పరిదిలోని సర్వే నంబర్ 120/11 ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమనిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ట్రైబల్ వెల్ఫేర్ ల్యాండ్ లో నిర్మిస్తున్న మూడు బేస్మెట్లను,ఒక రూమును తొలగించారు.
ప్రధాన రహదారికీ ఆనుకొని ఏర్పాటు చేసిన కంటైనర్ల ను తొలగించడంలో వివక్ష చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 120 సాయి పూజా కాలనీ చంద్రశేఖర్ రెడ్డి నగర్ ప్రభుత్వ భూమిలో నిర్మించిన అనుమతిలేని షెడ్ల తోపాటు, బేస్మెట్లు,రూములు తొలగించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. 59 జీవో అనుమతి ఉన్నా మున్సిపల్ నుండి అనుమతి తప్పని సరి అన్నారు. సర్వే నంబర్ 120/11లోని కొంత భూమిని ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రైబల్ వెల్ఫేర్ విభాగానికి కేటాయించినట్లు తెలిపారు.