calender_icon.png 7 October, 2024 | 4:19 AM

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

07-10-2024 02:02:26 AM

నేడు హోంమంత్రుల సమావేశానికి హాజరు 

వరద సాయంపై అమిత్‌షాకు నివేదిక  

* పార్టీ పెద్దలను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం 

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివా రం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలపై తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రులతోపాటు ఆయా రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో జరిగే సమావేశానికి తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదికను అందించనున్నారు. ఈ సమావేశం తర్వాత పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలను కూడా కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో రాష్ట్రంలో దాదాపు రూ. 10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.

కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది. తక్షణ సాయం కింద  కేంద్రం తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. ఇటీవల మళ్లీ కేంద్రం 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్లను విడుదల చేసింది. అందులో తెలంగాణకు కేవలం రూ.416.80 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్రం తెలంగాణకు అరకొర సాయం ప్రకటించడంతో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లారు.