- ఆరు నెలల్లో 20 మందికి పైగా మృత్యువాత
- మంగళవారం ఒకే రోజు రెండు ప్రమాదాల్లో ఇద్దరు
- ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
- మూడు శాఖల మధ్య సమన్వయ లోపం
మేడ్చల్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మూడు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రాణాల మీదకు తెస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణా లు పోతున్నా నివారణ చర్యలు చేపట్టక పోవడం విస్మయం కలిగిస్తోంది. ఆరు నెలల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు.
ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యే వరకు ఇంకెంత మంది ప్రాణాలు పోతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో చెక్ పోస్ట్ నుంచి అత్వెల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏడాది క్రితం పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో పనులు ప్రారంభించే ముందు వాహనదారులకు ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయడం లేదా వెడల్పు చేయడం చేయాలి.
కానీ మేడ్చల్ లో రోడ్డు వెడల్పు చేయకుండానే ఫ్లై ఓవర్ పనులు చేస్తుండడంతో ట్రాఫిక్ కు ఇబ్బం దులు కలగడమే గాక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యలో ఫ్లైఓవర్ పిల్లర్లు నిర్మిస్తుండడంతో ఇరువైపులా రోడ్డు ఇరుకుగా మారింది. కొన్నిచోట్ల స్థల సేకరణ ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ భాగం స్థల సేకరణ ఇబ్బందులు లేవు. అక్కడ రోడ్డు వెడల్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు.
నరకంగా మారిన నాలుగు కిలోమీటర్ల రోడ్డు
మేడ్చల్ పట్టణంలో ఇటువైపు నుంచి అటువైపు వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నరకంగా మారింది. రోడ్డు దాటాలన్నా, ద్విచక్ర వాహనం మీద ప్రయాణించాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసి వస్తోంది. ఇప్పటివరకు 20 మందికి పైగా ద్విచక్ర వాహనదారులు మరణించగా, వీరిలోఎక్కువమంది వెనుక నుంచి వాహ నం ఢీకొనడం వల్లే మరణించారు.
భారీ వాహనాలు ఢీ కొట్టి మీద నుంచి వెళుతుండ డంతో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం ఒకేరోజు రెండు ఘటనల్లో వెనుక నుంచి భారీ వాహనాల ఢీకొనగా ఇద్దరు మరణించారు. పట్టణంలో రోడ్డు ఇరుకుగా మారడం వల్ల ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతోంది. 44 నెంబరు జాతీయ రహదారి దేశంలోనే అతి పొడవైనది.
అంతేగాక మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ముఖ ద్వారం లాంటిది. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోటళ్ళు, బేకరీ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని ఆహార పదార్థాలపై దుమ్ము చేరు తోంది.
శాఖల మధ్య సమన్వయ లోపం
పట్టణంలో ఫ్లైఓవర్ పనులు జరుగు తున్నందున స్థానికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాల్సిన జాతీయ రోడ్లు భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ రోడ్లు భవనాల అధికారులు ప్రజల ఇబ్బందుల గురించి చర్యలు తీసుకోవడం లేదు. మిగతా శాఖల సమన్వయం కూడా కోరడం లేదు.
ఇప్పటికైనా జాతీయ రహదారుల అధికారులు ప్రమాదాల నివారణకు మిగతా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు. వివిధ పార్టీల నాయకులు సైతం ఈ సమస్యపై స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.