calender_icon.png 22 September, 2024 | 7:00 PM

అమరేశం రాజేశ్వర శర్మ మృతి

18-09-2024 01:59:01 AM

  1. ముగిసిన అంత్యక్రియలు
  2. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవులు, రచయితలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సంస్కృతాంధ్ర పండితులు, విశ్రాంత ఆచార్యులు, విమర్శకులు అమరేశం రాజేశ్వర శర్మ (95) మృతి చెందారు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఓ దవాఖానలో చేర్చగా, ట్రీట్‌మెంట్ పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అంబర్‌పేట శ్మశానవాటికలో రాజేశ్వర శర్మ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. రాజేశ్వర శర్మ స్వస్థలం కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, పీహెచ్‌డీ పూర్తి చేశారు. నన్నెచోడుడి కుమార సంభవంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

దీన్ని  అత్యంత ప్రామాణిక విమర్శనా గ్రంథంగా పండితు లు పేర్కొంటారు. 1951లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభిం చిన ఆయన వివేకవర్దిని కాలేజీలో అధ్యాపకుడిగా, ఉస్మానియా తెలుగు శాఖ అధిపతి గా, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌గా పని చేశారు. రాజేశ్వర శర్మ ఓయూ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తిచేశారు. ఆంధ్ర లక్షణ దీపిక,  వేదం వెంకటరాయశాస్త్రి రూపక సమాలోచనం, అహోబిల పండితీయాంధ్ర వివరణము, ఆంధ్ర వ్యాకరణ వికాసం లాంటి అనేక రచనలు చాలా ప్రాచుర్యం పొందాయి.

ఈయన ఆత్మకథ ‘ఆత్మ నివేదనం’ పుస్తక రూపంలో అచ్చయింది. చరిత్ర పుటలు పేరుతో బాలల కోసం నాటికలను కూడా రాశారు. పోతన భాగవత పంచశతి నీరాజనం, శారదా మంజీరం పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. శర్మ సాహిత్య కృషికి తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారంతో సత్కరించింది. కామారెడ్డి ప్రాచ్య విద్యా పరిషత్ స్థాపక కార్యదర్శిగా, వరంగల్ పోతన భాగవత పంచశతి మహోత్సవ కార్యదర్శిగా కూడా రాజేశ్వరశర్మ పని చేశారు. ఆయన మృతి పట్ల ఓయూ తెలుగు శాఖ ఆచార్యు లు, బోధకులతో పాటు కవులు, రచయితలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.