29-04-2025 11:13:07 PM
తిమ్మాపూర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్న విద్యార్థి విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో గల శ్రీరామ బాయ్స్ హాస్టల్ లో ఉంటూ పక్కనే ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న వికాస్ రెడ్డి, భాను అనే ఇద్దరు విద్యార్థులతో హాస్టల్ ఓనర్ సంతోష్ రావు హాస్టల్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు నరకాలని పురమాయించాడు.
వికాస్ రెడ్డి చెట్టు ఎక్కి కొమ్మలు నరికే క్రమంలో తెగిపడిన చెట్టుకొమ్మ కింద ఉన్న 11కెవి విద్యుత్ వైర్లపై పడి చెట్టుకు విద్యుత్ షాక్ రావడంతో చెట్టుపై ఉన్న వికాస్ రెడ్డి(23) మృతి చెందాడు, విద్యుత్ షాక్ వస్తుందని గమనించిన హాస్టల్ ఓనర్ సంతోష్ రావు కేకలు వేయడంతో చెట్టు కింద ఉన్న భాను అనే విద్యార్థి సంతోష్ రావును కిందికి లాగాడు, దీంతో సంతోష్ రావు ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్ఎండి పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వికాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా అని, అతని తండ్రి ఇటీవలే పని నిమిత్తం దుబాయ్ వెళ్ళాడని తోటి స్నేహితులు తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థితో చెట్టు నరికించి ప్రాణాలు పోవడానికి కారణమైన సదరు హాస్టల్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.