calender_icon.png 23 October, 2024 | 2:08 AM

చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తుంచుకోవాలి

18-09-2024 06:31:01 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎస్ఐ రఘుపతి అన్నారు. బుధవారం రాయపోల్ మండల పరిధిలోని అనాజీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు.

మత్తు పదార్థాల వినియోగం ద్వారా బుధవారం యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్షణికానందం కోసం మత్తు పదార్థాలు సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలిపోతుందని, కొంతమంది వ్యక్తులు డబ్బు సంపాదన కోసం గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయాలకు పాల్పడుతున్నారని అన్నారు.

స్వార్థపరుల చేతుల్లో యువత బలి కావద్దని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివిస్తున్నారని వారి కలలను సాకారం చేయాలని అన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీ నిర్మల, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.