వర్షాకాలం మొదలైంది. తొలకరి జల్లులతో తాపం తగ్గుతోంది. నగర పొలిమేరలు దాటి పోతే కంటినిండుగా పచ్చదనం కనపడే కాలం ఇది. ఇలాంటి సమయాల్లోనే కొన్నాళ్ళు అన్నీ వదిలేసి ప్రకృతింట ఉండాలనిపిస్తుంటుంది. ‘ఇస్మార్ట్’ హీరోయిన్ నభా నటేష్ కూడా ఇలాగే అనుకుందేమో.. బ్యాక్ప్యాక్ తగిలించుకొని అలా అడవులు, నదీ తీరాలు, మంచుకొండలు చుట్టేసి వచ్చింది. అయితే ఇదంతా చేసింది.. ఆమె కథానాయికగా నటించిన ‘డార్లింగ్’ సినిమాలో భాగంగానే.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో రూపొందిన ఈ సినిమాకి ‘వై దిస్ కొలవెరి’ అనేది ఉపశీర్షిక. నభా చేసిన ఈ సాహస యాత్ర వెనుక గల కారణాలేమిటి..? ఈ ప్రయాణంలో ఆమె గడించిన అనుభవాలేమిటి? అన్నది జూలై 19న తెలియనున్నాయి. విడుదలకు చేరువవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘రాహీ రే..’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేశారు రూపకర్తలు. ఇలాంటి సాహస యాత్రల ద్వారానే ‘లోకమనే తోటలో.. అందరూ రంగుల పూవులే’ అన్న సత్యం తెలిసి వస్తుందంటున్న రచయిత కాసర్ల శ్యామ్, ఈ ప్రయాణంలో “జాబిల్లి మన కాపలే.. సూరీడే దారులే చూపులే” అనే ధైర్య వచనాలు చెబుతూ “విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే.. ఇక నిలిచేవి మన గుర్తులే..” అంటూ జీవన గమనాన్ని అందరూ గానం చేసుకునేలా రాశారు.
కపిల్ కపిలన్ ఆలపించిన ఈ గీతానికి వివేక్ సాగర్ స్వరాలందించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి కథానాయకుడిగా కనపడనుండగా, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు.