హైదరాబాద్: మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందని దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని దానం పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదన్నారు. అపాయింట్ మెంట్ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం లేక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారని దానం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారనని దానం ఆవేదన వ్యక్తం చేశారు. విలువ లేనిచోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ విలువ ఉంటుందని చెప్పారు.