ఏదైనా వంటకం తాళింపు వేయడానికి కరివేపాకు ఉపయోగిస్తాం. అప్పాల కోసం కూడా కరివేపాకు ఉపయోగిస్తుంటాము కానీ ప్రత్యేకించి కరివేపాకుతో పిండివంట అయితే చేసి ఉండమని ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనకు అక్కడే పులిస్టాప్ పెట్టేసి ఎంతో రుచికరమైన కరివేపాకు చెక్కలు ఎలా చేయాలో తెలుసుకోండి..
కావలసిన పదార్థాలు..
కరివేపాకు చెక్కలు తయారికి ఒక కప్పు గోధుమపిండి, అరకప్పు కరివేపాకు, రెండు టీస్పూన్ల కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సరిపడినంత ఉప్పు, సరిపడా నూనె తీసుకోవాలి.
తయారీ విధానం..
ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఒక చెంచా గోరువెచ్చని నూనె, తరిగిన కరివేపాకు వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లి కాస్త గట్టిగా ముద్ద చేసుకోవాల్సి ఉంటుంది. పొయ్యి వెలిగించి దాని మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. పిండి ముద్దను చపాతీలా ఒత్తి కత్తితో కావాల్సిన సైజ్లో ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. వీటిని నూనెలో దోరగా కాల్చుకుంటే కరకరలాడే కరివేపాకు చెక్కలు రెడీ అవుతాయి.