calender_icon.png 11 October, 2024 | 7:55 PM

8,465 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్

01-10-2024 12:00:00 AM

ముంబయి: ప్రముఖ టెలీ కమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ  ఎయిర్‌టెల్ టెలికాం విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను కొంత తీర్చినట్లు ప్రకటించింది. 2016లో సంస్థకు కేటాయించిన స్పెక్ట్రమ్‌కుసంబంధించిన బకాయిను 9.3 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.8,465 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంస్థ పేర్కొంది. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన పిటిషన్ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దాంతో కంపెనీలు చేసేదేమిలేక బకాయిలు చెల్లిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏజీఆర్ లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ గతంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి.

ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. టెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. కొన్ని సంస్థల నివేదిక ప్రకారం వొడాఫోన్‌ఐడియా 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ  ఎయిర్‌టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది.