calender_icon.png 11 October, 2024 | 3:48 PM

27,800 కోట్ల హ్యుందాయ్ మెగా ఐపీవో

10-10-2024 12:00:00 AM

కంపెనీ విలువ రూ. 1.6 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం భారతీయ సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటివరకూ దేశంలో ఏ కంపెనీ జారీచేయ నంత పెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌తో వస్తున్నది. వచ్చేవారం ప్రైమరీ మార్కెట్లో ప్రవేశించనున్న ఈ ఐపీవో ద్వారా రూ.27,800 కోట్లు (3.3 బిలియన్ డాలర్లు) సమీకరించాలని కంపెనీ ప్రతిపాదిస్తున్నది.

ఇప్పటివరకూ రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూయే దేశంలో అతిపెద్దది. అంతకు ముందు 2021లో పేటీఎం పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. 2010లో వచ్చిన రూ.15,199 కోట్ల కోల్ ఇండియా ఐపీవో, 2008లో జారీ అయిన రిలయన్స్ పవర్ రూ. 11,563 కోట్ల ఆఫర్, 2017లో వచ్చిన రూ.11,176 కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవోలు భారీ ఆఫర్లుగా నమోదయ్యాయి.

సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటింగ్ సంస్థ  హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.  ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. హ్యుందాయ్ ఆఫ ర్ చేయనున్న వాటాలకు ఒక్కో షేరుకు రూ.1,865 చొప్పున  (22 డాలర్లు) ప్రైస్‌బ్యాండ్‌గా నిర్ణయించారు.

హ్యుందాయ్ ఇండియాకు  రూ.1.60 లక్షల కోట్ల విలువను (19 బిలియన్ డాలర్లు) ఆపాదిస్తూ ఐపీవో ధరను ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌తో అక్టోబర్ 14న ఐపీవో ప్రారంభమ వుతుంది. రిటైల్, ఇతర విభాగాల్లో బిడ్స్ ను అక్టోబర్ 15 నుంచి 17 వరకూ ఆహ్వానిస్తారని ఆ వర్గాలు వివరించాయి.