- దసరా కానుక
- ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు
- తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5 వేలు
- లాభాల్లో వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- గత ఏడాది ఒక్కో కార్మికుడికి బోనస్ రూ.1.70 లక్షలు
- ఈ ఏడాది అదనంగా రూ.20 వేలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 20 ( విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా దసరాకు ముందే బోనస్ ప్రకటించారు. గతేడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాల ఆధారంగా కార్మికులకు 796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి కార్మికునికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున బోనస్ను ప్రకటించారు.
సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో గని కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి లాభాలు, విస్తరణ.. బోనస్కు సంబంధించిన వివరాలను వివరించారు.
రూ.4,701 కోట్ల ఆదాయం..
‘రాష్ట్రానికే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థ రాష్ర్టంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఇతర సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు పలు రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తోంది. సింగరేణి కార్మికుల శ్రమతో 2023 -24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా మిగిలినవి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నాం. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్కరికి బోనస్ కింద రూ.1.90 లక్షలు అందించనున్నాం. గతేడాది సింగరేణి కార్మిలకు అందిన బోనస్ రూ.1.70 లక్షలు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకొక్కరికి అదనంగా అందుతున్న మొత్తం రూ.20 వేలు.’
కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్..
సింగరేణి సంస్థ చరిత్రలోనే కాంట్రాక్ట్ కార్మికులకూ రాష్ర్ట ప్రభుత్వం తొలిసారిగా బోనస్ ప్రకటించింది. సంస్థలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారని, వారిలో ఒక్కొక్కరికి రూ.5 వేల బోనస్ అందజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందజేయనున్నట్లు చెప్పారు.
సింగరేణి విస్తరణే లక్ష్యంగా..
సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ‘ సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం. రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్లోని ప్రస్తుత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కల మరో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, రామగుండంలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్పైన 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలి ’ అని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.
ఓసీలను ప్రారంభిస్తం..
సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటీ, నైనీ ఓసీలను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని భట్టి వెల్లడించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్రావు, సింగరేణి ఎండీ బలరాం, కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.