calender_icon.png 9 October, 2024 | 9:55 PM

గల్ఫ్ మృతులకు ఎక్స్‌గ్రేషియా 10.60 కోట్లు

09-10-2024 02:06:42 AM

విడుదల చేసిన మంత్రి పొన్నం 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల కింద ప్రభుత్వం రూ.10.60 కోట్లు కేటాయించిందని, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డాక్టర్ బీఎం వినోద్‌కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌రావులకు మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా  చెల్లింపు ఏ రాష్ట్రంలోనూ లేదని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమమని కొనియాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన గల్ఫ్ కార్మికుల వారసులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవాలని మంద భీంరెడ్డి కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్నారై బృందం సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, అధికారులు ఎస్.హరీశ్, కార్తీక్, చిట్టిబాబు, రూపలను వారు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.