22-03-2025 08:02:53 PM
కన్వెన్షన్ శాతం పెంచాలి
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల,(విజయక్రాంతి): నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెదలాలని, దోషులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత చాలా కీలకమైందని, నేరస్థులకు వారెంట్స్, సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
కోర్టు ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్ఎస్లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే బాధితులకు మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. మేజిస్ట్రేట్, బాధితులు కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ మంచిగా క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తారని, నిందితులకు శిక్ష పడడంలో చాలా కృషి చేశాడని చెప్పుకోవాలని, ఏదైనా నేరం చేసిన వారికీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు తప్పకుండా శిక్షపడేలా కృషి చేయాలని కోరారు.
అనంతరం కోర్ట్ డ్యూటీ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ హత్య, హత్యా యత్నం, చీటింగ్ కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషిచేసిన, లోక్ అదాలత్ కేసులలో ప్రతిభ చూపిన కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ కి సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లా రెడ్డి, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సీసీఆర్బీసీ ఇన్స్పెక్టర్ సతీష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సిసి హరీష్ తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.