calender_icon.png 19 February, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

15-02-2025 08:31:10 PM

జిల్లాలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, కమ్యూనిటీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను శనివారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని వెల్లడించారు. కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.