06-04-2025 10:59:25 PM
రూ.1.04 లక్షలు స్వాధీనం..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులను హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు(South East Task Force Police) అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక మంగళ్హాట్ పోలీసులతో కలిసి ధూల్పేట్లోని నాలా మచిలీపురలో తనిఖీలు నిర్వహించారు. ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న ధూల్పేట్కు చెందిన విక్కీ సింగ్, వి.రాకేష్, బి.సందీప్లను అరెస్ట్ చేశారు. చెన్నైలోని శైలేందర్ అనే బుకీ ద్వారా లైవ్ నంబర్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పంటర్ల నుంచి పందెం నిర్వహించడానికి ఈ లైవ్ నంబర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.1.04 లక్షలు నగదు, 6 సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.