అంచనాలకు తయారీకి ఆదేశం
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
కరీంనగర్: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల దుర్గాబాయి మహిళా శిశు కేంద్రం (మహిళా ప్రాంగణం)లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం మహిళా శిశు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రాంగణంలోని భవనాలను, ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. మహిళా శిశు కేంద్రంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వసతి గృహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన అంచనాలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంచనాలను అందజేస్తే ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ అనితా సింగ్నాథ్, సీనియర్ అసిస్టెంట్ సుధా, అకౌంటెంట్ రాజా కిషన్ రెడ్డి, వార్డెన్లు రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు.