03-03-2025 12:00:00 AM
నర్సారెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలి
గజ్వేల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి
గజ్వేల్, మార్చి 2: కాంగ్రెస్ పార్టీ నాయకులపై అభియోగాలు మోపి పార్టీలో విభేదాలు సృష్టిస్తే సహించేది లేదని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాయిని యాదగిరిని టిడిపి నుండి తన్ని తరిమేస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ బిక్ష పెట్టిన డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూ%ళి%కుంట నర్సారెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదన్నారు. రాజకీయ లబ్ధి, నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతున్న నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్త లాంటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టిన నర్సారెడ్డిని విమర్శించడం తగదని హితవు పలికారు.
కనీసం కౌన్సిలర్ గా గెలవని నాయిని యాదగిరి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టిస్తూ పక్క పార్టీల వైపు చూస్తుండడంతో ఆయనను పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు. 100 ఎకరాల వంశపారంపర్య ఆస్తులను కాంగ్రెస్ పార్టీ కోసం నర్సారెడ్డి ఖర్చు చేయగా, 10 ఏళ్ల కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. టిడిపి పార్టీతో ఆటలాడిన ఈ నేతలు ప్రస్తుతం పార్టీలో కోవర్టులుగా పనిచేస్తూ చిచ్చు పెడుతున్నట్లు తెలిపారు.
2014 మున్సిపల్ ఎన్నికల్లో నాయిని యాదగిరి ఆడిన రాజకీయ క్రీడ పార్టీని బ్రష్టు పట్టించగా, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎవరిని ఎదగనీయకుండా, అణగద్రొక్కినట్లు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూ%ళి%కుంట నర్సారెడ్డికి వెన్నుపోటు పొడుస్తూ మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో నాయిని యాదగిరి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చినట్లు తెలిపారు.
ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్నట్లు చేస్తున్న దుష్ర్పచారం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎక్కడైనా తాము ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. కేవలం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసమే నాయిని యాదగిరి కొత్త నాటకానికి తెర లేపగా, ఓసి కేటగిరిలో ఆయన ఆ పదవిని ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ద్వారా పదవులు పొంది నాయకులుగా చలామణి అవుతున్న పలువురు నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, లింగారావు, కిష్టాగౌడ్, మాజీ ఎంపీపీ మోహన్, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్త , సీనియర్ నాయకులు న్యాయవాది సాజిద్ బేగ్, సుఖేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, నాయకులు భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ వహీద్, సమీర్, జంగం రమేష్ గౌడ్, గుంటుకు శ్రీను, శివారెడ్డి, నీల శ్రీనివాస్, అంజద్, గోపాల్ రెడ్డి, ఊడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.