కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీ నర్సమ్మ ఇటీవల మృతి చెందడంతో శనివారం కరీంనగర్ లోని గంగుల ఇంటికి వెళ్లి లక్ష్మీ నర్సమ్మ చిత్ర పటానికి సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గంగుల వెంకన్న, సుధాకర్, కమలాకర్ లను పరామర్శించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్ తల్లిదండ్రులు గంగుల మల్లయ్య లక్ష్మీనర్సమ్మ ఎంతో కష్టపడి పైకి ఎదిగారని, వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన వీరు ఆ గ్రామ అభివృద్ధి కోసం అక్కడి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో లక్ష్మీనర్సమ్మ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని నాడు ఆ గ్రామ సర్పంచ్ గా ఎన్నికై ప్రజలకు ఎంతో సేవ చేశారని, అనంతరం కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు కోసం కరీంనగర్ లో స్థిరపడ్డారని, వారి కుమారులు వ్యాపార, ప్రజా రంగాల్లో రాణించారంటే అందుకు లక్ష్మీనర్సమ్మ కృషి ఎంతో ఉందని, కుమారుల ఎదుగుదలను చూసి ఎంతో సంతోషించేదని అలాంటి మాతృమూర్తి మరణం వారి కుటుంబానికి ఎంతో తీరని లోటు అని వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, పైడిపెల్లి రాజు, బూడిద సదాశివ ఉన్నారు.