11-03-2025 10:12:52 PM
ఎల్బీనగర్: విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో మమేకమై వారి స్పందనను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించడంతోపాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సుధీర్ బాబు సూచించారు.