బెంబేలెత్తుతున్న గ్రామస్తులు...
కామారెడ్డి (విజయక్రాంతి): పాడి దూడపై చిరుత దాడి చేసి లేగ దూడను చంపిన ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బోనాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బంజారా తాండాకు చెందిన బార్మవత్ దరియాకు చెందిన పాడి దూడపై సోమవారం రాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బార్మవత్ దరియాకు అటవీని అనుకుని ఉన్న తన పంట చేను వద్ద రోజు వారీగా పశువులను అక్కడే కట్టేసేవాడు. రోజు లాగానే సోమవారం సాయంత్రం పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చారు.
మంగళవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి చూడగా లేగదూడ చనిపోయి ఉంది. దీంతో బాధితుడు గ్రామస్తులకు, స్థానికులకు, సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని చిరుత దూడను చంపి తిన్నదని అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మృతి చెందిన పాడి దూడ 35 వేల రూపాయల విలువగలదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు. చిరుత సంచారంతో బోనాల్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాలంటేనే గ్రామస్తులు, రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు జంకుతున్నారు.