calender_icon.png 19 October, 2024 | 10:11 AM

195 దేశాలను చుట్టొచ్చిన తెలుగోడు

12-08-2024 12:00:00 AM

ఈరోజుల్లో ఒక్క క్రంటీని విజిట్ చేస్తే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఓ యూట్యూబర్ మాత్రం 195 దేశాలను చుట్టేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని దేశాలను సందర్శించాలనే తపన, వివిధ దేశాల సంప్రదాయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ప్రపంచాన్ని సైతం చుట్టేసి రావోచ్చని నిరూపించాడు తెలుగు ట్రావెలర్ ‘రవి ప్రభు’.

కొత్తగా చేయాలనే తపననే రవిని యూట్యూబర్ గా మార్చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 195 దేశాలను చుట్టేలా చేసింది. ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన ప్రపంచంలోని 195 దేశాలను చుట్టేసి అరుదైన ట్రావెలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రపంచ పర్యటన ఇప్పటి వరకు కేవలం 300 మంది మాత్రమే చేశారు. అందులో రవి ప్రభు ముందువరుసలో ఉంటారు. భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన అతికొద్ది మందిలో రవి ప్రభు ఒకరు కావడం విశేషం. అందులోనూ ఏకైక తెలుగు వ్యక్తి కావడం గర్వకారణం. తన ప్రపంచ పర్యటనతో దేశానికి, తెలుగు ప్రజలకు గుర్తింపు తీసుకొచ్చిన రవి ప్రభు ప్రయాణంలోని విశేషాలు ఆయన మాటల్లోనే...

స్ఫూర్తి అంటూ ఏమీ లేదు...

తొమ్మిదేళ్లు  ఉన్నప్పుడు పేరెంట్స్ భూటాన్ తీసుకెళ్లారు. అప్పటి నుంచే నా జర్నీ మొదలైంది. కానీ సొంత సంపాదనతో యాత్ర చేయడం మాత్రం 1997లో మొదలుపెట్టి నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నా. ప్రపంచయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా స్ఫూర్తి ఎవరూ లేరు. చిన్ననాటి నుంచే అట్లాస్ అంటే పిచ్చి. ఏ దేశం ఎక్కడుందో వెతికి తెలుసుకునేవాణ్ణి. జియోగ్రఫీ క్విజ్‌లో పాల్గొని ఫస్ట్ రావడం. ఇలా తెలియకుండానే ఒక ఆసక్తి మొదలైంది. మొదటిసారి భూటాన్ వెళ్లినప్పుడు వారి కల్చర్, ఆహారపు అలవాట్లు కొత్తగా అనిపించాయి. హెచ్‌సీయూలో నేను పొలిటికల్ సైన్స్ చదువులో కూడా వివిధ దేశాల వ్యవహారాలు, రాజకీయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఈ అంశాలన్నీ నేను ప్రపంచ యాత్ర చేయడానికి ఆసక్తి చూపాయి.

కఠినమైనదే. కానీ పూర్తి చేశా..

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 మంది మాత్రమే గ్లోబల్ పర్యటనలు చేశారు. అందులో నేను ఉండటం మాటల్లో చెప్పలేనంత సంతోషం. అయితే కొందరు అంతరిక్షంలోకి వెళ్తే.. మరికొందరు ఎత్తయిన ఎవరెస్ట్‌ను అధిరోహించారు. కానీ ప్రపంచ పర్యటనలో భాగంగా 195 దేశాలను తిరిగింది అతి కొద్ది మంది మాత్రమే  ఇది ఎంత కఠినమైనదో. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా ప్రతి దేశ పర్యటనను విజయవంతంగా కంప్లీట్ చేశా. అయితే కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడలేదు. కుటుంబం, ఉద్యోగాన్ని చూసుకుంటూ ట్రావెలింగ్ చేశా. ఒకవైపు ఫ్యామిలీని, జాబ్ ను సమన్వయం చేసుకుంటూనే 195 దేశాల్లో పర్యటించా

మొత్తం ఖర్చు రూ.25 కోట్లు...

అందరి లాగా నేను కంటిన్యూగా ట్రావెల్ చేయను. మిగతా వారు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తుంటారు. అలా వెళ్తే పెద్దగా ఖర్చు ఏమీ కాదు. కానీ నేను కొన్ని రోజులు పర్యటన వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవాణ్ణి. ఈ క్రమంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది.  అయితే నా మొత్తం పర్యటనలకు రూ. 25 కోట్ల వరకు ఖర్చు పెట్టా. 

కనీసం ఐఫోన్ కూడా లేదు

నేను యాత్ర మొదలుపెట్టినప్పుడు కనీసం ఐ ఫోన్ కూడా లేదు. ఇతరుల వీడియోలను చూసెం దుకు యూట్యూబ్ కూడా లేదు. అందులో ఛాన ల్స్ లేవు. అప్పుడు లైబ్రరీలో పుస్తకాల్లో చూసి ప్లా నింగ్ చేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ట్రావెలింగ్ చాలా సులువైంది. పాస్‌పోర్టు, డబ్బులు, ఫోన్ ఉం టే ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ నేను స్టార్ట్ చేసిన సమయంలో ట్రావెలింగ్ బిగ్ టాస్క్. ఇప్పుడు ప్రపంచ యాత్ర మొదలు పెట్టాలనుకునేవారు ముఖ్యంగా బడ్జెట్, సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వేలల్లో వీడియోలు వస్తున్నాయి. వాటి ఆధారంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. ముందుగా మన దగ్గరలో ఉన్న శ్రీలంక, నేపాల్, బర్మా, భూటాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాలతో మొదలుపెడితే మంచిది.

క్రాంతి మల్లాడి, 

విజయక్రాంతి ప్రతినిధి