- రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందిపెడితే సహించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రా లపాడులో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిబంధనల పేరుతో ఇబ్బందిపెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు పంటను ఇళ్ల వద్దనే ఆరబెట్టు కుని తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలన్నారు.
అప్పుడే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. ప్రైవేట్ వ్యాపారుల తూకంలో నాణ్యతను తూనికలు, కొలతల అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. సీసీఐ అధికారులు, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులను సమన్వయం చేస్తూ మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీజ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధబాబు పాల్గొన్నారు.