calender_icon.png 26 October, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

26-10-2024 12:19:33 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 25: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఇన్‌చార్జి ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా శివరాత్రి కుమార్ అనే కాంట్రాక్టర్ మున్సిపాలిటీ టెండర్‌లో పాల్గొని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద 3 క్రేన్‌లు ఏర్పాటు చేశాడు.

ఇందుకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఘట్‌కేసర్ మున్సిపల్ ఇన్‌చార్జి ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న బోడుప్పల్ కార్పొరేషన్ ఏఈ మంగురావు రాజశేఖర్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ మేడే సన్నీ బిల్లు మంజూరు కావాలంటే రూ. 1.50 లక్షలు   లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

వారి సూచనల మేరకు ఏఈకి రూ.80 వేలు, వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం డబ్బులు ఇచ్చేందుకు బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లగా, ఆఫీస్‌లో వద్దు ఇంటి వద్ద తీసుకుంటానని చెప్పాడు.

ఈ క్రమంలోనే ఏఈ రాజశేఖర్‌కు కాంట్రాక్టర్ లంచం ఇస్తుండగా ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకొని ఘట్‌కేసర్ మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ సన్నీకి ఫోన్ పే ద్వారా రూ.30 వేలు పంపడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.