16-03-2025 12:00:00 AM
ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు.. వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ సమయంలో చల్లని ప్రదేశాలకు విహారయాత్ర ఎంతో హాయినిస్తుంది. అయితే ఇందుకోసం దేశం విడిచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనదేశంలోనే కొన్ని ప్రాంతాలు వేసవిలోనూ చల్లదనాన్ని పంచుతాయి. ప్రకృతి ఒడిలో సేదదీరడానికి, మనసులో ప్రశాంతతను నింపుకోవడానికి ఈ ట్రిప్ చాలా ఉపయోగపడుతుంది.
హిమాలయా పర్వత శ్రేణుల మధ్య ఉన్న సిమ్లా నగరం. అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం. ఇది వేసవిలోనూ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. ఇక్కడి మాల్ రోడ్లో కలియ తిరుగుతూ స్థానిక మార్కెట్లను అన్వేషించవచ్చు. వేసవి మే నెలలోనూ షిమ్లాలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్కు మించవు.
చిరపుంజి..
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సందర్శించడానికి చక్కటి ప్రదేశాలలో ఒకటి చిరపుంజి. ఏడాదిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. చల్లగా మబ్బులతో కూడిన వాతావరణం ఆకాశంలో భారీ మేఘాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఆకుపచ్చని అడవులు, విభిన్న జంతుజాలం, గంభీరమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన చిరపుంజి వేసవిలో తప్పకుండా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మే నెలలో పగటి ఉష్ణోగ్రత 15-23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
అండమాన్నికోబార్ దీవులు..
చాలా వేడి కాకుండా.. చల్లగా కాకుండా వెచ్చని వాతావరణంను అనుభవించాలంటే బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు వెళ్లవచ్చు. మే నెలలో ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఈ దీవులు ఎంతో అద్భుత దృశ్యాలను, ఆహ్లాదకరమైన వాటర్ స్పోర్ట్స్ను ఎంజాయ్ చేస్తారు. సహజమైన బీచ్లలో విశ్రాంతి తీసుకోవచ్చు.
కొడైకెనాల్..
దక్షిణాదిలోని మరొక ప్రసిద్ధ వేసవి పర్యాటక ప్రాంతం కొడైకెనాల్. చుట్టూ పచ్చదనం, మంత్రముగ్ధులను చేసే కొండలు, లోయలతో ప్రకృతి సౌందర్యం నిండి ఉంటుంది. వేసవిలో కొడైకెనాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వీచే చల్లని గాలులను ఆస్వాదించడం కోసం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత్త 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొడైకెనాల్లో చూడాల్సిన ప్రదేశాలు.. గ్రీన్ వ్యాలీ వ్యూపాయింట్, బేర్ షోలా జలపాతం, కోకర్స్ వాక్ ఉన్నాయి.
మనాలీ
హిమాచల్ప్రదేశ్లోని ‘మనాలీ’ మంచు ప్రదేశం. ఇది సాహసాలు చేసేవారికి, భక్తులకు కూడా ఇది అనువైన ప్రాంతం. విమానంలో వచ్చేవారు మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలోని భున్తార్ ఎయిర్పోర్టులో దిగి అక్కడి నుంచి రావొచ్చు. మనాలీకి వచ్చినవారు తప్పకుండా ‘కులు’కు వెళ్లాల్సిందే. మనాలీ పర్వతశ్రేణులతో పాటు, కులూలోని లోయలు మంచి పర్యాటక ప్రదేశాలు.
రైలులో వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలోని జోగిందర్ నగర్ రైల్వేస్టేషన్ (న్యారోగేజ్)లో దిగాలి. లేదా 245 కిలోమీటర్ల దూరంలోని ఉనా (బ్రాడ్గేజ్) స్టేషన్లో దిగొచ్చు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు.. హదింబ దేవాలయం, హిమాలయన్ నింగ్మపా గొంప మానెస్ట్రీ, క్లబ్ హౌస్, సోలంగ్ వ్యాలీ, జోగినీ ఫాల్స్, అర్జున గుఫ, వశిష్ట్ వేడినీటి గుండం.