04-03-2025 04:27:58 PM
కాన్వేయర్ బెల్ట్ పనులు ప్రారంభం
టర్నర్ లోని బురద, మట్టి తోడివేతకు మార్గం సుగమం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ ప్రమాదంలో భారీగా పేరుకుపోయిన నీటి ఊట బురద, మట్టి దిబ్బల కారణంగా చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు సహాయక బృందాలకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రమాదం సంభవించిన రోజు నుండి 11 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు. తాజాగా మంగళవారం సొరంగంలోని కన్వేర్ బెల్ట్ మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో సుమారు సొరంగంలో పేరుకుపోయి ఉన్న పదివేల క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను బయటికి తోడి వేసేందుకు ఈ కన్వేర్ బెల్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. సుమారు గంటకు 800 క్యూబిక్ మీటర్లు బురద, మట్టిని బయటికి తీసుకు వచ్చే విధంగా ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుందని రెస్క్యూ టీం బృందాలు పేర్కొన్నాయి.
మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డిజిపి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, 12 రకాల రెస్క్యూటిమ్ బృందాల ఉన్నత స్థాయి అధికారులు నిర్విరామంగా పనిచేస్తున్న సహాయక చర్యలను వారు పరిశీలించారు. జిపిఆర్ రాడార్ ద్వారా గుర్తించిన కార్మికుల ఆనవాళ్లను బయటికి తీసేందుకు ప్రస్తుతం అడ్డంకిగా ఉన్న బురద నీటి ఊట తోపాటు టీబీఎం యంత్రం పరికరాలు కూడా కన్వేయర్ బెల్ట్ సహాయంతో బయటికి రానున్నాయి. నీటి ఊటను కూడా తగ్గించేందుకు ఎంజిఆర్ఐ నిపుణులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు టెర్నల్ లోకి సుమారు నిమిషానికి 6000 లీటర్ల నీటి ఊట వస్తుండగా డీ వాటరింగ్ ప్రక్రియ కూడా మరింత వేగవంతం చేశారు. దీంతో రెస్క్యూటిమ్ బృందాలకు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు కన్వేయర్ బెల్ట్ మొదటి అడుగు పడనుంది.