12-02-2025 05:30:02 PM
నల్లవల్లిలో ఎనిమిదో రోజుకు చేరిన రిలే దీక్షలు..
గుమ్మడిదలలో జాతీయ రహదారిపై గొర్రెలతో నిరసన..
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా మండల ప్రజలు నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారు. నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల మధ్య ఏర్పాటు అవుతున్న డంప్ యార్డును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల ప్రజలు చేపట్టిన నిరసనలు బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకోగా గుమ్మడిదలలో మండల రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన రెండవ రోజుకు చేరుకుంది. మరోవైపు గుమ్మడిదల నల్లవల్లి కొత్తపల్లిలో మూడు చోట్ల ర్యాలీలు నిర్వహించారు.
మండల రైతు జేఏసీ ఆధ్వర్యంలో గుమ్మడిదలలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. గుమ్మడిదలలోని జాతీయ రహదారిపై మంగళవారం బర్రెలతో నిరసన చెప్పిన ప్రజలు బుధవారం గొర్రెలతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. గుమ్మడిదలలో చేపట్టిన దీక్ష వద్దకు తహసీల్దార్ గంగాభవాని వచ్చి డంపు యార్డ్ పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించగా రైతులు, జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. తమకు డంపు యార్డ్ వద్దే వద్దంటూ తేల్చి చెప్పారు. డంప్ యార్డ్ ను శాశ్వతంగా రద్దు చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు.