calender_icon.png 14 October, 2024 | 10:47 AM

కానిస్టేబుల్ ఆత్మహత్య

14-10-2024 04:01:18 AM

గంజాయి కేసులో తనను ఇరికించారని సెల్ఫీ వీడియో 

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 13(విజయక్రాంతి): గంజాయి కేసులో తనను అనవసరంగా ఇరికించారని ఓ సెల్ఫీ వీడియోలో ప్రస్తావిస్తూ శనివారం ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో భ్యూకాసాగర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

గతంలో గంజాయి కేసులో నిందితుడిగా ఉ న్న ఇతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా అతడి సస్పెషన్ ఎత్తేసినా విధుల్లో చేరలేదు. గంజాయి కేసులో తనను అన్యాయంగా ఇరికించారనిసెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఖమ్మం జిల్లా ఏన్కూరులో శనివారం పురుగులమందు తాగాడు. పరిస్థితి విషమించడంతో  హైదరాబాద్‌కు తరలించగా, చికి త్స పొందుతూ మృతిచెందాడు.

వీడియోలో పలువురు ఎస్‌ఐల పేర్లను భుక్యాసాగర్ ప్రస్తావించాడు. బీఆర్‌ఎస్ నాయకులు, ఎస్‌ఐల అండదండలతో గంజాయి దందా సాగిందని, తనను అన్యాయంగా ఇరికించారని వీడియోలో వెల్లడించాడు. ఎస్‌ఐలు రాజ్‌కుమార్, సంతోష్ చేసిన పనికి తాను నిందలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ చేసిన ఆరోపణలను పోలీస్ అధికారులు ఖండించారు.

పాల్వంచ సీఐ వినయ్‌కుమార్‌ను వివరణ కోరగా అతడిపై సస్పెషన్ ఎత్తేసినా విధుల్లో చేరలేదని, అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. 

గన్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనోవేదన

మహబూబాబాద్ జిల్లాలో విషాదం

హనుమకొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి):  కుటుంబ కలహాలతో గన్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. డీఎస్పీ తిరుపతిరావు కథనం ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

శ్రీనివాస్‌కు భార్య వరలక్ష్మి, కొడుకు సుశాంత్ ఉన్నారు. ఐదేళ్లుగా శ్రీనివాస్‌కు భార్య వరలక్ష్మితో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న క్రమంలో శ్రీనివాస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.