calender_icon.png 22 September, 2024 | 7:02 PM

ఆటుపోట్లు జయించి.. అధికారం సాధించి

16-09-2024 01:11:21 AM

38 నెలలు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన రేవంత్ 

ఆరుగురు ఎమ్మెల్యేలతో మొదలై.. 65 ఎమ్మెల్యేలతో అధికారం 

బీఆర్‌ఎస్‌ను ఓడించి.. కేసీఆర్‌ను గద్దె దించిన పంతం

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాం తి): రేండే్ంల క్రితం వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు జీరో.. ఆ పార్టీని అప్పడు అధికారంలో ఉన్నవాళ్లు తరుచూ చచ్చిన శవం అని ఎద్దేవా చేసేవారు. కానీ, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకోవటం తోనే పార్టీ దశ తిరిగింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న నేతలను సముదాయించి, బుజ్జగించి, బెదిరించి ఒక్కతాటిపైకి తెచ్చారు. కలిసిట్టుగా కష్టపడి అసా ధ్యం అనుకొన్నదానిని సుసాధ్యం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ దాదాపు 38 నెలలు పనిచేశారు. 

జూన్ 26, 2021న రేవంత్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం పీసీసీ బాధ్యతలను అప్పగించగా, జూలై 7న గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వమే ప్రమాదంలో ఉంది. అధికా రం సంగతి అటుంచి.. పార్టీ మిగులుతుందా అన్న ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నా యి. ఒక వైపు అధికార బీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమైన పరిస్థితి. మరోవైపు ప్రత్యామ్నాయ స్థానం కోసం సవాలు విసురుతున్న బీజేపీ. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించా రు.

సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. 2014 వ్యూహాత్మక వైఫల్యాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. తిరిగి 2018లో కూడా 19 సీట్లకే పరిమితమైంది.  కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలతో కాం గ్రెస్ పార్టీకున్న ఆ 19 ఎమ్మెల్యేల సంఖ్య ఆరు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలన్న పట్టుదల,  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయాలన్న పట్టు దలతో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఎన్నో కేసులు, వేధింపులు 

పీసీసీ చీఫ్ ప్రస్థానంలో రేవంత్‌కు ఎన్నో ఒడిదుడుకులు, ప్రభుత్వ వేధింపులు, కేసు లు, హౌజ్ అరెస్టులు, నిర్బంధాలు, ఫోన్ ట్యాంపిగులు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. పార్టీలో ఉండే నాయకులెవరో, పోయే నాయకులెవరో తెలియని పరిస్థితి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తిగా చతికిలపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి తొలి సవాల్‌గా నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3,014 (1.5 శాతం) ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది.

దీంతో ఇక కాంగ్రెస్ ఖతం అనుకున్నారు. అంతలోనే మునుగో డు ఉప ఎన్నిక. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్రను రెండింటిని సమన్వయం చేసుకోవడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీనే ప్రత్మామ్నాయం అనే భావన ప్రజల్లో బలపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేసివారికి దగ్గరికి కావాలనే ఉద్దేశంతో దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జన, రైతు సం ఘర్షణ సభ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు 33 రోజులపాటు చేపట్టిన యాత్ర (పాదయాత్ర) కాంగ్రెస్ పార్టీకి గేమ్ ఛేంజర్‌గా మారింది. ఉత్తర తెలంగాణలో జిల్లాల్లో బలమైన బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదగడంలో ఈ యాత్ర ఎంతో దోహదపడింది.

రైతులు, దళిత, గిరిజన, బీసీ, యువత, విద్యార్థులు, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను డిక్లరేషన్ ల రూపంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య సమక్షంలో విడుదల చేశారు. ఇవన్నీ ఆయా వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సీటు రాకుండా చూస్తామనే మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. దేశవ్యాప్తం గా మోదీ హవా సాగుతున్న పరిస్థితుల్లో సైతం తెలంగాణలో బీజేపీని నిలువరించి 8 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజ యం సాధించేలా చూసి తన సామర్ధ్యం ఏమిటో రేవంత్‌రెడ్డి  నిరూపించుకున్నారు. 

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు

* 2021, ఆగస్టు 9 ఇంద్రవెల్లి, ఆగస్టు 18 రావిర్యాల దళిత గిరిజన దండోరా

* 2021, ఆగస్టు 24, 25 మూడు చింతలపల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష

* 2021, సెప్టెంబర్ 17 గజ్వేల్‌లో దళిత గిరిజన దండోరా

* 2021, సెప్టెంబర్ 20 గన్ పార్క్, హైదరాబాద్ వైట్ చాలెంజ్

* 2021 సెప్టెబంర్ 22, హైదరాబాద్ ఇందిరా పార్క్

* 2021 సెప్టెంబర్ 27 భారత్ బంద్, ఉప్పల్ డిపో ముందు నిరసన

* 2021 అక్టోబర్ 2 నిరుద్యోగ జంగ్ సైరన్, ఎల్ బీనగర్, హైదరాబాద్

* 2021 అక్టోబర్ 5 క్యాండిల్ ర్యాలీ, నెక్లెస్ రోడ్, హైదరాబాద్

* ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఘటనకు నిరసనగా 2021 అక్టోబర్ 11న ఇందిరా పార్క్ మౌన దీక్ష

* ఉద్యోగ నియామకాల కోసం మహబూబ్‌నగర్‌లో 2021 అక్టోబర్ 12న నిరుద్యోగ జంగ్ సైరన్. 

* రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని 2021 నవంబర్ 18న హైదరాబాద్‌లో  ధర్నా

* రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఎదురవుతున ఇబ్బందులపై 2021 నవంబర్ 19న  కల్లాల్లోకి కాంగ్రెస్

* 2021 నవంబర్ 20 రైతు చట్టాలకు వ్యతిరేకంగా మరణించిన రైతులకు నివాళిగా నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ 

* ధాన్యం కొనుగోలు చేయాలని 2021 నవంబర్ 27, 28 వరి దీక్ష.

* తెలంగాణ అమరుల స్తూపం నిర్మాణ జాప్యంపై నిరసన 2012 డిసెంబర్ 11న నిరసన 

* రైతు డిక్లరేషన్‌కు సంబంధించి మే 6, 2022న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ

* ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో 2023 మే 8న యువ సంఘర్షణ సభ. 2023, జూలై 2 ఖమ్మంలో రాహుల్ సభ

* 2023, ఆగస్టు 27 తుక్కుగూడలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ 

* 2023, సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

* 2023, సెప్టెంబర్ 17 తుక్కుగూడలో విజయభేరి సభ

* కామారెడ్డిలో 2023, నవంబర్ 9న బీసీ డిక్లరేషన్, 2023, నవంబర్ 9 మైనార్టీ డిక్లరేషన్ విడుదల