సర్వైకల్ క్యాన్సర్ బాధితురాలికి గర్భం, శిశు జననం
కౌన్సెలింగ్ చేసిన కిమ్స్ కడల్స్ వైద్యురాలు డాక్టర్ వసుంధర
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): గర్భాశయ ముఖద్వారా (సర్వైకల్) క్యాన్సర్ వచ్చినప్పటికీ 27 ఏళ్ల యువతి శిశువుకు జన్మనిచ్చిందని హైదరాబాద్లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, లాప్రోస్రోపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర ఆదివారం తెలిపారు. ఏపీలోని తణుకుకు చెందిన మౌనికకు గర్భం దాల్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దీంతో కిమ్స్ కడల్స్ హాస్పిటల్ను సంప్రదించారని పేర్కొన్నారు.
క్యాన్సర్ కారణంతో గర్భసంచి తొలగిస్తే తర్వాత జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదని, గర్బసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేస్తే పిల్లలు పుట్టే అవకాశంపై వివరించినట్టు తెలిపారు. మూడు కౌన్సెలింగుల తర్వాత బాధితురాలు చికిత్సకు అంగీకరించారని తెలిపారు. ముందుగానే పిండాలను సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత క్యాన్సర్ చికిత్స ప్రారంభించామని పేర్కొన్నారు. క్యాన్సర్ ఉన్న భాగం మాత్రమే తొలగించి ఫ్రీజ్ చేసిన పిండాలను తిరిగి గర్భసంచిలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. చికిత్స పూర్తయిన 37 వారాల తర్వాత పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టిందని, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు.