03-04-2025 12:42:03 AM
బీజేఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): బీసీల కోసం కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీజేఎల్పీ ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. బీసీల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడింది.. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీయేనని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
నెహ్రూ కుటుంబం నుంచి రేవంత్రెడ్డి వరకు అందరూ బీసీ వ్యతిరేకులేనని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ముస్లిం బీసీలంటూ అన్యమతస్తులకు బీసీ రిజర్వేషన్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సాకులు చెప్పకుండా ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.