calender_icon.png 23 October, 2024 | 4:03 AM

మాజీ ఎమ్మెల్యే రైతులను రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి

18-09-2024 07:22:38 PM

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాలతో రెండు రోజుల్లో పనులు పూర్తి

ఎడమ కాలువ గండి ప్రదేశాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

నడిగూడెం,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు కండ్లుండి కూడ చూడలేని కబోది మాటలు మాట్లాడుతూ రైతులను రెచ్చ కొడుతున్నాడని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు వెంకటరత్నం బాబు విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిని పూడ్చేందుకు చేపట్టిన పనులను వారు పరిశీలించారు. యుద్ధపాతిపదికనా రైతులకు నీరు అందించేందుకు 24 గంటలు కష్టపడి పని చేస్తుంటే రైతులను రెచ్చగొట్టే ధోరణితో ఆయన మాట్లాడుతున్నారన్నారు.

రానున్న రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి 21వ తారీకు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని రైతులు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి హెలికాప్టర్లో తిరిగి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాస్త ఆలస్యం అయినా పనులు పూర్తి నాణ్యతతో చేయాలని అధికారులకు సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం తగదన్నారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్న అధికారులకు శాలువా కప్పి  పూలదండలతో  ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, నెమ్మది దేవమని, యాతాకుల జ్యోతి, రావెల్ల కృష్ణారావువిద్యాసాగర్ పార వెంకటేశ్వరరావు లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.