కొడంగల్ ‘హస్తం’ పార్టీలో లుకలుకలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
శనివారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, బీఎస్పీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నర్మద నందినగర్ నివాసంలో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడం గల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు.
మొన్నటిదాకా రేవంత్రెడ్డి తిట్టిపోసిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక వర్గాల ధర్నాలు, రాస్తారోకో లతో తెలంగాణ అట్టడుకుతుంటే మంత్రులు విహారయాత్రల పేరుతో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ర్ట ఆదాయం తగ్గుతోందని, కాంగ్రెస్ నేతల ఆదాయం అమాంతం పెరుగుతోందని ఆరోపించారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మూటలు నింపుకునే పనిలో మునిగి తేలుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ను ఇత ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తరలిస్తోందని, ఇది అధికార దుర్వినియోగం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి కొడంగల్లో కాంగ్రెస్ను మట్టికరి పించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.